ద్విపదభాగవతం - మధురకాండ : అక్రూరుఁడు కుంతీదేవిని గాంచి కుశలప్రశ్నఁ గావించుట
నరుదేరఁ గొంతియు నక్రూరుఁ జూచి
కరచకితాస్యయై కన్నీరు దొరుగ
నెలుఁగెత్తి యేడ్చుచు నెడయైన వగలఁ
బలుమారు పలవింపఁ పడఁతి నూరార్చి
ధర్మనందనవృకోదరపార్థకవల
నర్మిలి కౌఁగిట నందంద చేర్చి
యందఱ మణిభూషణాళిఁ బూజించి
కాందినీసూనుఁడా కమలాక్షి కనియె
“అమ్మ! మీ మేనల్లుఁ డమరేంద్రవంద్యుఁ
డమ్ముకుందుఁడు మిమ్ము నరయఁ బుత్తెంచె
పాండుమహీపతి పరలోకమరుగ
నిండిన వగలతో నీవుఁ బుత్రులును
యిచ్చటి కరుదెంచి రెఱిఁగి రమ్మనిన
వచ్చితి, నచ్చట వసుదేవుఁ డొంటి
మనవారలెల్ల నెమ్మది నున్నవారు
ఘనపాపకర్ముని గంసునిఁ ద్రుంచి
ధరణిరాజ్యము వాని తండ్రికి నిచ్చి. - 480
హరియెల్ల శత్రుల నణఁచుచున్నాఁడు;
తగిన మీ కిట్టిదుర్దశ వొందుటెఱిఁగి
వగచుచునుండు నా వసుదేవసుతుఁడు;
తనపుత్రులట్ల తాఁ దలఁచి నీ సుతుల
యనుఁగొప్ప బ్రోచునా యాంబికేయుండు?
దుర్యోధనాదిపుత్రులు వీరితోడఁ
గ్రౌర్యంబు లెడబాసి కలసియుండుదురె?
పండితసామంత బంధులు మిమ్ముఁ
బాండుఁ గొల్చినయట్ల భజియింతురమ్మ?”